ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 6: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలోని వెంకటేశుని గుట్టపై ఆళ్వారుల విగ్రహాలను గుర్తించారు. కొన్నేండ్ల నుంచి వేంకటేశ్వరుడిగా భావించి సమీపంలోని గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు. పలువురు వేదపండితులు రెండురోజుల క్రితం వెళ్లి పరిశీలించి.. శిల్పకళా శైలిని చూసి ఏడో శతాబ్దానికి చెందిన ఆళ్వారుల విగ్రహాలుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 12 మంది ఆళ్వారులు విష్ణుభక్తులని, వీరు దక్షిణాదిన వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారని చెప్పారు. కాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ మాత్రం అవి ఆళ్వారుల విగ్రహాలే అయినప్పటికీ శైలిని బట్టి అవి 16వ శతాబ్దం నాటివిగా భావిస్తున్నట్టు తెలిపారు.