Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్లో తీవ్ర నీటి కొరత నెలకొన్నదని చెప్తూ మహారాష్ట్రను ఒప్పించి కొయినా డ్యామ్ నుంచి నీళ్లను తీసుకురావాలని యత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. సాగర్లో ఉన్న నీళ్లను ఉదారంగా ఏపీకి ధారాదత్తం చేస్తున్నది. ఇప్పటికే 5 టీఎంసీల వినియోగానికి అవకాశం ఇవ్వగా, తాజాగా మరో 2 టీఎంసీలను అదనంగా వాడుకునేందుకు అనుమతివ్వ టం గమనార్హం.
మే చివరి వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అంశంపై కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో కూడిన త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లో సమావేశమైం ది. ఇరు రాష్ర్టాలకు నీటి అవసరాల ఇండెంట్లను బోర్డుకు నివేదించాయి. రెండు ప్రాజెక్టుల్లో 80 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తేల్చారు. అందులో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించారు. అందులో శ్రీశైలం నుంచి 30, సాగర్ నుంచి 15 టీఎంసీలను ఏపీ వినియోగించుకోవాల్సి ఉన్నది.
ఎగువన శ్రీశైలంలో నీటిని వాడుకోలేకపోయామని, సాగర్ నీటిని వాడుకుంటామని చెప్పి ఇప్పటికే ఏపీ 5 టీఎంసీలను వినియోగించుకున్నది. ఇప్పుడూ అదే సాకుతో ఫిబ్రవరికి సాగర్ ఎడమ కాలువ ద్వారా మరో 2 టీఎంసీలను విడుదల చేయాలని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణ సర్కారు అనుమతివ్వటం గమనార్హం. సాగర్లో నీటి కొరత ఉన్నదని చెప్పి, ఆ నీటినే వాడుకోవటానికి అనుమతి ఇవ్వటం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.