హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నిర్ణయంతో తమ 36 ఏండ్ల కల సాకారమైందని, తమ జన్మంతా వారికి రుణపడి ఉంటామని కాయితి లంబాడ (మథుర/లభాన లంబాడ) సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బంతిలాల్ నాయక్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ఇతర కులాలతో పాటుగా కాయితి లంబాడాలను కూడాఎస్టీ జాబితాలో చేర్చాలని సీఎం కేసీఆర్ నిండు సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడాన్ని వారు స్వాగతించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 34 వేల మందికిపైగా న్యాయం జరుగనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలనలో ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ఆందోళనలు చేసినా తమను ఎవ్వరూ పట్టించుకోలేదని తెలిపారు.
1977 నుంచి 1986 వరకు తమ సామాజికవర్గం ఎస్టీలోనే కొనసాగిందని, నాటి ప్రభుత్వాలు తమను సంచార జాతులుగా అభివర్ణించి బీసీ-డీలో కలిపారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో అవకాశాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై తమ సంఘం ప్రతినిధులు గతంలో స్థానిక ఎమ్మెల్యే ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారని, అప్పుడు ఆయన ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చారని తెలిసిన వెంటనే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం నుంచి హైదరాబాద్కు తరలి వచ్చినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన తమకు బయటి ప్రపంచంతో సంబంధం తక్కువగా ఉంటుందని, వ్యవసాయం, గోవులను కాచుకోవడం తప్ప తమకు వేరే పని తెలియదని, అలాంటి వారిని తీసుకెళ్లి బీసీల్లో కలపటంతో ఆర్థికంగా, సామాజికంగా చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
పోడు భూముల పట్టాలకు కూడా తాము నోచుకోలేదని, ఇప్పుడు తమను సీఎం కేసీఆర్ ఎస్టీల్లో చేర్చడం వల్ల మునుపటిలా అభివృద్ధి ఫలాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సహకారంతో తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తమ బిడ్డల చదువుకు కొంత నిధిని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. తమ సామాజికవర్గం బాధలను పట్టించుకొని వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రులు నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, స్థానిక ఎమ్మెల్యే సురేందర్ను కలిసి ధన్యవాదాలు తెలియ చేశారు.