హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ కేసు మళ్లీ కలకలం సృష్టించింది. సినీ నటుడు నవదీప్తోపాటు షాడో సినిమా నిర్మాత ఉప్పల పాటి రవి పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లు ఉండగా, మరో ఐదుగురు వినియోగదారులు ఉన్నారు. డ్రగ్స్ కేసు వివరాలను హైదరాబాద్ సీపీ, యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్-నాబ్) డైరెక్టర్ సీవీ ఆనంద్ గురువారం మీడియాకు వెల్లడించారు.
మాదాపూర్ డ్రగ్ పార్టీపై 10 రోజుల క్రితం దాడిచేసి సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నాకర్రెడ్డి అలియాస్ వెంకట్ను, అతడి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భాస్కర్ బాలాజీని, రైల్వేలో పనిచేసే మురళి అనే వినియోగదారుడిని అరెస్టు చేశామని చెప్పారు. వీరి ద్వారా బెంగళూరులో నైజీరియాకు చెందిన అమోబి చుకువుడి మునాగోలు, ఇగ్బేర్ మైఖెల్, థామస్ అనాగ కాలుతోపాటు వినియోగదారులైన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విఠల్రావు కొడుకు దేవరకొండ సురేశ్రావు, కొల్లి రామ్చంద్, కురపాటి సందీప్, సినీ డైరెక్టర్ అనుగు సుశాంత్రెడ్డి, ఫోర్ గేమ్ నిర్వాహకుడు పగళ్ల శ్రీకార్ కృష్ణ ప్రణీత్ను అరెస్టు చేశామని చెప్పారు.
డ్రగ్స్ సరఫరాదారు భాస్కర్ బాలాజీతో సంబంధాలు ఉన్న గచ్చిబౌలి స్మార్ట్ పబ్ నిర్వాహకుడు సూర్య, జూబ్లీహిల్స్ టెర్ర కేఫ్ నిర్వాహకుడు అర్జున్, సినీ నిర్మాత ఉప్పల పాటి రవి (షాడో సినీ నిర్మాత), హీరో నవదీప్, వ్యాపారీ కలహార్రెడ్డి, శ్వేత, కార్తీక్ తదితరులు పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. బేబీ సినిమాలో డ్రగ్స్ సీన్లు ఉన్నందున ఆ యూనిట్కు నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. సినీ ఫైనాన్సియర్ వెంకట్ బ్యాంకు ఖాతాలో రూ.5.5 కోట్లను సీజ్ చేశామని తెలిపారు. మరో ముగ్గురు నైజీరియన్లతోపాటు కీలక సూత్రధారి వరంగల్కు చెందిన రాంకిశోర్ వైకుంఠం పరారీలో ఉన్నారని చెప్పారు.