Allu Arjun | ‘పుష్ప2’ ప్రీమియర్ షో వేళ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై ఆ సినిమా హీరో అల్లు అర్జున్ (Allu Arjun) స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.
‘మేం ‘పుష్ప 2’ ప్రీమియర్ షోకి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్కు వెళ్లాం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలాయని తెలిసింది. ఇద్దరు పిల్లల తల్లి రేవతి గారు చనిపోయారని తెలియగానే మా చిత్ర బృందం అంతా షాక్ కు గురయ్యాం. థియేటర్ కి వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడటమనేది గత 20 ఏండ్లు నాకు ఆనవాయితీగా వస్తున్నది. ప్రేక్షకులకు వినోదాన్నిచ్చే సినిమా థియేటర్ వద్ద అలా జరగడం బాధగా ఉంది. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. ఎంత చేసినా ఆమె లేని లోటు తీర్చలేనిది. నా తరపున రూ.25 లక్షలు సాయం చేయాలని నిర్ణయించుకున్నా’ అని ఆయన తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.