వరంగల్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలతో వైద్య విద్య అందరికీ అందుబాటులోకి వస్తున్నది. గతంలో మెడికల్ సీటు అంటే అసాధ్యమనే ఆలోచన నుంచి ఇప్పుడు అందరికీ ఆ అవకాశం ఉంటుందనే పరిస్థితి వచ్చింది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంతో ఎక్కువ మందికి ఎంబీబీఎస్ చదివే అవకాశం వచ్చింది.
కన్వీనర్ కోటాలోనే ఎక్కువ మంది పేదలకు ఈ అవకాశం రావటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రెండో విడత సీట్ల భర్తీలో 1,59,419 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఓపెన్ లోకల్ క్యాటగిరీలో సీటు వచ్చింది. ఈడబ్ల్యుస్ క్యాటగిరీలో 1,42,345, ఎస్సీ 2,43,666, ఎస్టీ 2,28,912, బీసీ(సీ)లో ఏకంగా 2,66,945 ర్యాంకు అభ్యర్థులకు సీటు వచ్చింది. బీసీ(డీ)లో 1,75,332, బీసీ(ఈ) 1,84,057, మైనార్టీ క్యాటరిగీలో 1,82,683 ర్యాంకు అభ్యర్థులు సీట్లు పొందారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నది. కన్వీనర్ కోటా రెండో విడత సీట్ల భర్తీ ప్రక్రియను సోమవారం పూర్తి చేసింది. ఈ వివరాల ఆధారంగా ఎంబీబీఎస్ సీటు పొందిన వారి వివరాలపై స్పష్టత వచ్చింది. మొదటి విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్లో 2.38 లక్షల నీట్ ర్యాంకు సాధించిన అభ్యర్థి ఎంబీబీఎస్ పొందారు. కన్వనీర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్లో బీసీ సీ క్యాటగిరీలో 2,66,945 ర్యాంకు సాధించిన మహిళా అభ్యర్థికి సీటు వచ్చింది. ఈ స్థాయి ర్యాంకుకు సీటు రావడం ఇదే తొలిసారి. కాగా, సీట్లు ఖాళీగా ఉంటే మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నది. దీంతో మరికొంత మందికి కన్వీనర్ కోటాలోనే సీట్లు దక్కనున్నాయి.
కన్వీనర్ సీట్లు 5,514
ప్రస్తుత విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 54 మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను భర్తీచేసేలా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 5,514 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,950 బీ క్యాటగిరీ సీట్లు, 220 సీ క్యాటగిరీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత ఈ క్యాటగిరీ సీట్లు మిగిలితే రాష్ట్ర కోటాలోనే భర్తీ చేస్తారు. రాష్ట్రంలోని ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ సీట్లకు సంబంధించి మొదటి కౌన్సెలింగ్లో 5.39 లక్షల ర్యాంకర్కు సీటు వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సీ క్యాటగిరీలో మొదటి విడత కౌన్సెలింగ్లో 12 లక్షల నీట్ ర్యాంకర్కు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఈసారి మరింత మందికి వైద్య విద్య చదువుకునే అవకాశం దక్కనున్నది.