హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సకాలంలో బియ్యం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్న మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించనున్నది. ఇకపై రాష్ట్రంలోని మిల్లులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఇవ్వొద్దని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యంగా డిఫాల్టర్ మిల్లర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం ఇవ్వకూడదని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలోని మిల్లర్లకు బదులుగా పొరుగు రాష్ర్టాల్లోని మిల్లులకు ఇవ్వాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ ఆదివారం భేటీ అయ్యారు. ఇతర రాష్ర్టాల మిల్లర్లకు ధాన్యం ఇవ్వడంతోపాటు ఇతర అంశాలపై కీలకంగా చర్చించినట్టు తెలిసింది. సోమవారం జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ర్టాల్లోని మిల్లులకు ధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లో ఎన్ని మిల్లులు ఉన్నాయి? వాటి సామర్థ్యం ఎంత? అనే అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు లెక్కలు సేకరిస్తున్నారు. ధాన్యాన్ని ఇతర రాష్ర్టాల మిల్లులకు ఇచ్చేందుకు ఇప్పటికే ఎఫ్సీఐ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.
మిడిల్ పాయింట్లో ధాన్యం నిల్వ..
ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ నేరుగా మిల్లులకు తరలిస్తున్నది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల సంస్థ తరఫున ఎఫ్సీఐకి బియ్యం అప్పగిస్తారు. ప్రభుత్వ ఆలోచన అమల్లోకి వస్తే ఈ విధానం మారనున్నది. ఇకపై ధాన్యాన్ని మిల్లులకు ఇవ్వకుండా ఎంపిక చేసిన మిడిల్ పాయింట్స్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ఇతర రాష్ర్టాల్లోని మిల్లులకు కేటాయింపుల ఆధారంగా విడతలవారీగా తరలిస్తారు.
మరింత పెరగనున్న ఉత్పత్తి
ఇప్పటికే రాష్ట్రంలోని మిల్లుల వద్ద గత మూడు నాలుగు సీజన్లకు సంబంధించిన సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం ఉన్నది. మరో రెండు నెలల్లో ఈ వానకాలం ధాన్యం రావటం మొదలవుతుంది. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 1.30 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో కొనుగోలు కేంద్రాలకు సుమారు కోటి టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నది. అంటే అప్పుడు మిల్లుల వద్ద 1.70 కోట్ల టన్నుల ధాన్యం పోగుపడుతుంది. మరో నాలుగైదు నెలల్లో యాసంగి ధాన్యం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంత భారీ మొత్తంలో ధాన్యం మిల్లింగ్ చేయడం సవాలుగా మారనున్నది. దీనికి తోడు మిల్లర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వేగంగా మిల్లింగ్ చేయకపోవడం ప్రభావం చూపనున్నది. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా ఇతర రాష్ర్టాల మిల్లర్లకు ధాన్యం మిల్లింగ్ను అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఇష్టారాజ్యంగా మిల్లర్ల తీరు
రాష్ట్రంలో కొందరు మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. సకాలంలో సీఎమ్మార్ (బియ్యం) ఇవ్వకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారు. కొందరు మిల్లర్లు ప్రతిపక్షాలతో అంటకాగి రైతుల్లో, ప్రజల్లో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎప్పటికప్పుడు ధాన్యానికి సంబంధించిన సీఎమ్మార్ (బియ్యం)ను సకాలంలో డెలివరీ చేయాల్సిన బాధ్యత మిల్లులపై ఉన్నది. కానీ కుంటిసాకులు చెప్తూ ప్రతీ సీజన్లో సీఎమ్మార్ను ఆలస్యం చేస్తున్నారు. ఓవైపు సీఎమ్మార్ అందించడంలో మిల్లర్లు ఆలస్యం చేస్తుంటే మరోవైపు గడువు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటున్నది. గడువు ముగిసిన తర్వాత సీఎమ్మార్ను తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. ఈ విధంగా మిల్లర్ల ఆలస్యంతో 2019-20, 2020-21 యాసంగి సీజన్కు సంబంధించి సుమారు రూ. 700 కోట్ల విలువైన 2 లక్షల టన్నులకు పైగా బియ్యం ఇక్కడే నిలిచిపోయాయి. దీంతో ఆ భారం మొత్తం పౌరసరఫరాల శాఖపై పడుతున్నది.