రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ను తనకు కేటాయించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కోరారు. శనివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలి విడత తెలంగాణ ఉద్యమంలో మొదట అరెస్ట్ అయిన తొమ్మిది మంది విద్యార్థి నేతల్లో తాను ఒకడినని,సాగరహారం, మిలియన్ మార్చ్తోపాటు ఓయూ టు కేయూ విద్యార్థి పాదయాత్రకు నేతృత్వం వహించినట్టు వెల్లడించారు. దండోరా పరంగా అత్యధిక కేసులను ఎదుర్కొన్న వ్యక్తిని కూడా తానేనని తెలిపారు. తెలంగాణ, మాదిగ ఉద్యమాల నేపథ్యం ఉన్న తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్టు వంగపల్లి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మాట ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.