కాచిగూడ, ఫిబ్రవరి 3: దేశాభివృద్ధిని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని మంత్రి కేటీఆర్ చేసిన విమర్శను స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. తండ్రికి దగ్గ తనయుడిగా మంత్రి కేటీఆర్ ఎదిగారని కొనియాడారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో బీసీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించి, దేశంలోని 75 కోట్ల మంది బీసీల మనోభావాలను కించపరిచారని కేంద్ర ప్రభుత్ంవపై ఆయన ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలకు కేవలం అంత తక్కువ కేటాయించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
మోదీ తక్షణమే పార్లమెంట్ సభ్యులతో సమావేశమై, దానిని సవరించాలని డిమాండ్ చేశారు. ఆ కేటాయింపును రూ.2 లక్షల కోట్లు చేయాలని అన్నారు. మోదీ ప్రభుత్వం బీసీల వ్యతిరేకి అని ఈ బడ్జెట్లో తేటతెల్లమైందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం 75 ఏండ్లుగా బీసీలను బిచ్చగాళ్లుగా చూస్తున్నదని, బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, బీసీలంటే వాటాదారులని, త్వరలో బీసీల సత్తా ఎంటో మోదీ ప్రభుత్వానికి రుచిచూపిస్తామని ఆయన హెచ్చరించారు. బీసీ ప్రధాని అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని గంపెడు ఆశతో మోదీని ప్రధానిని చేస్తే, నేటికీ మోదీ పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో వివక్ష కొనసాగుతున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జబ్బల శ్రీనివాస్, గుజ్జ సత్యం, సూర్యనారాయణ, నీలం వెంకటేశ్, కోల జనార్దన్, భూపేశ్సాగర్, రాజ్కుమార్, సుధాకర్, నందగోపాల్, రామకృష్ణ, బీ కృష్ణ, శివమ్మ, రమాదేవి, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.