యాదాద్రి భువనగిరి : కరువు నేల ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు రప్పించి సస్యశ్యామలం చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం బద్దుతండా, గమధమల్ల భీమారిగూడెంకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో (BRS Joinings) చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. చిన్న చిన్న గూడెంలు, తండాలను గ్రామపంచాయతీలుగా చేసి వారికి పాలనను మరింత చేరువ చేశారని వెల్లడించారు. ధరణి (Dharini) తో రైతుల భూములను రక్షించేలా సీఎం కేసీఆర్ (CM KCR) చర్యలు తీసుకుంటే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ రైతులను ఆగం చేసేలా వ్యవహారిస్తుందని దుయ్యబట్టారు. మరోవైపు రైతుల బోర్ల మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చేస్తున్న ఆలోచన దుర్మార్గమైనదని అన్నారు.
రైతులకు అన్ని పథకాలు అమలు చేస్తుండడంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి డాక్టర్లను తయారు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశానికి బువ్వపెట్టె రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని ఆమె పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మరిన్ని పథకాలు వస్తాయని, ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మహారాష్ట్రలో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటూ బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో కరువు రాకుండా గంధమల్లను 4.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ చేయాలనేది తన కోరికని కరువు నేల ఆలేరును గోదావరి జలాలు తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తానని పేర్కొన్నారు.