హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, హంపి హనుమద్ జన్మభూమి క్షేత్ర ట్రస్టుల మధ్య చర్చ అసంపూర్తిగా ముగిసింది. తిరుమలలో ని సంస్కృత విద్యాపీఠం లో టీటీడీ, హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మధ్య గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ వాదనలను హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిరాకరించింది. రామాయణం ప్రకారం కిష్కిందనే మారుతీ జన్మస్థలమని ట్రస్టు ఫౌండర్ గోవిందానంద సరస్వతి వ్యాఖ్యానించారు. సామాన్య జనాలను గందరగోళంలోకి నెట్టేలా టీటీడీ వాదనలు ఉన్నాయన్నారు. హనుమంతుడి జన్మతిథి అంటే మూడు తిథులు ఎలా పెడతారని ప్రశ్నించారు. టీటీడీ పుస్తకంపై జీయర్ స్వాముల వద్దకు తాము వెళ్తామని, ధర్మం గురించి తేల్చాల్సింది ధర్మాచార్యులేనని స్పష్టంచేశారు. టీటీడీ వాళ్లు ఎప్పుడైనా పంపాకు వచ్చారా? అని ప్రశ్నించారు. టీటీడీ కమిటీకి ప్రత్యేక అధికారం ఉందా? అని అడిగారు. కమిటీ పెడుతున్నప్పుడు తిరుపతి పెద్ద జీయర్స్వామిని అడిగారా? అని నిలదీశారు. పెద్ద జీయర్స్వామి కమిటీలో ఎందుకు లేరని ప్రశ్నించారు. టీటీడీ కమిటీకి ప్రామాణికత లేదన్నా రు. శృంగేరి శంకరాచార్యులు, కంచి కామకోటి పీఠాధిపతులు, మధ్వాచార్యు లు, తిరుమల పెద్ద జీయర్, చినజీయర్ సమక్షంలో చర్చించాలన్నారు.