మునుగోడు, నవంబర్ 13: మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరి లో నిలిచిన చలమల్ల కృష్ణారెడ్డిపై భారీ భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడు కృష్ణ తన తల్లి భూలక్ష్మితో కలిసి సోమవారం మునుగోడులో మీడియా ముందుకు వచ్చారు. కృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘హయత్నగర్ మండలం తారామతిపేటలోని 242, 243, 244, 245 సర్వే నంబర్లలో సుమారు 200 ఎకరాల ఇనాం భూమికి మా తాత మూల స్వామి ఇనాందారుగా ఉన్నారు.
ఆయన కుమారుడు మూల అంజయ్య 1985లో ఈ భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోగా.. లీగల్గా ఎదుర్కోలేక 2000 సంవత్సరంలో చలమల్ల కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు కలిసి ఆయన్ని అదృశ్యం చేశారు. ఆయన సోదరి భూలక్ష్మి.. తమ్ముడి అదృశ్యంపై పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన భూమిని చలమల్ల కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు కబ్జా చేస్తున్నారంటూ 2007లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు భూలక్ష్మి పేరిట ఈ భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దాంతో హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ సంతోష్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దానిని బెంచ్పైకి రాకుండా చలమల్ల కృష్ణారెడ్డి అడ్డుకున్నాడు’ అని బాధితుడు కృష్ణ పేర్కొన్నాడు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకే చల్లమల్ల బీజేపీలో చేరాడని ఆరోపించారు. ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉన్నదని, తమను కాపాడాలని వేడుకున్నారు.