సూర్యాపేట : అమిత్ షాది అంతా అబద్ధాల షో. ఆయన మాట్లాడే ప్రతి అక్షరం అబద్ధమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు.
తుక్కుగూడ సభలో అమిత్ షా కేంద్ర మంత్రి హోదా మరిచి కింది స్థాయి నాయకుడిగా మాట్లాడారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మీద, తెలంగాణ అభివృద్ధి మీద విషం చిమ్మడం తప్పా తెలంగాణ ప్రజలకు ఉపయోగ పడే మాట ఒక్కటైన చెప్పిండా? అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ బాగోతమంతా ప్రజలకు తెలుసని మంత్రి పేర్కొన్నారు.
బండి సంజయ్ కొంగ జపానికి ప్రజలు మోసపోరు. బీజేపీ నాయకుల తీరుకు ప్రజలంతా నవ్వుకుంన్నరని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ను చూసి కేంద్రంలో వణుకు పుట్టింది. ఆయనకు సమకాలిన నాయకుడు దేశంలోనే లేరన్నారు. సీఎం కేసీఆర్ను ఎదుర్కునే శక్తి లేక అబద్ధాల ప్రచారంతో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా వరాలు కురిపిస్తున్నడు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందే.
కేంద్రమంత్రి హోదాలో వచ్చిన అమిత్ షా తెలంగాణకు ఎమిచ్చిండో ఇక్కడి బీజేపీ నాయకులకు ఇప్పుడైనా అర్ధమైందా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు జాతీయ నాయకులను తీసుకువచ్చి మరింత నవ్వుల పాలవుతూ.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారే తప్పా కొత్తగా వారికి వొరిగేదేమి లేదన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.