చెన్నూర్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలతో పంట లు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి మండలాల్లో గోదావరి వరదతో నీట మునిగిన పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో 2,600 మంది రైతులకు సంబంధించి 5,600 పైచిలుకు ఎకరాల్లో పత్తి, వరి తదితర పంటలు నష్టపోయినట్టు ప్రాథమిక నివేదకను ప్రభుత్వానికి పంపించినట్టు చెప్పారు. బుధవారం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును కలిసినట్టు చెప్పారు. గోదావరి, ప్రాణహిత నదుల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం కాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.