సూర్యాపేట : రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం.. ఆ మహనీయుడికి సీఎం కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు.
సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు.ఈ మేరకు ఇంతటి చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ గురువారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షిరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్తమాననికి అంబేద్కర్ చరిత్ర తెలుసునేందుకు ఇదొక గొప్ప అవకాశంగా ఉంటుందన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఇదే సంప్రదాయం పాటిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.
దేశ రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పెట్టాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.