హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15 న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 9.06 లక్షల రెగ్యులర్ విద్యార్థులుండగా, మరో 45 వేలు ప్రైవేట్ విద్యార్థులున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే కాలేజీ లాగిన్ ఐడీలో విద్యార్థుల హాల్టికెట్లను విడుదల చేశారు. సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలను నిర్వహిస్తారు. ప్రశ్నపత్నాలను తెరవడం.. ఆన్సర్షీట్లను నింపే ప్రక్రియనంతా సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
53 వేల మంది విద్యార్థులు ఫీజు చెల్లించలేదు
ఇంటర్లో ఈ ఏడాది 53,162 విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదు. వీరంతా అడ్మిషన్లు పొందినా ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేసుకున్నా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. ఇలాంటి వారు ఫస్టియర్లో 16,191 మంది విద్యార్థులు కాగా, సెకండియర్లో 36, 971 మంది విద్యార్థులున్నారు. ఫీజు చెల్లించేందుకు ఇంటర్బోర్డు పలు మార్లు అవకాశం ఇచ్చింది. తత్కాల్ స్కీం కింద కూడా ఫీజు చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. అయినా 53 వేలకు పైగా విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది.