తొర్రూరు : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత జనరంజకంగా పాలన చేస్తున్న సీఎం కేసీఆర్(CM KCR) కు జనమంతా అండగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar) పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్(BRS) కే పట్టం కట్టనున్నారని సర్వే(Surveys)లు వెల్లడిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంగళవారం తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో పలు వార్డులకు సంబంధించి పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలోనూ మరోసారి తానే 80వేల మెజార్టీతో విజయం సాధించి తీరుతానని ధీమాను వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని చూస్తున్నారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వ్యక్తులు అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు వారి మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే రూ.200 లకు గ్యాస్ సిలిండర్(Gas Sylender Price ) ఇస్తామని చెప్పి, రూ.1200 చేశారని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి, అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు కారకులై నేడు ధరలు తగ్గించాలని ధర్నాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.