అమీర్పేట్, జనవరి 4: ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కలిపి ఓ సమగ్ర చట్టం తీసుకురావాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీవీ చానళ్లు వచ్చినప్పుడు ‘ప్రెస్ యాక్ట్ 1951’ను సవరించాలని అనుకున్నారని, ఇంతలో డిజిటల్ మీడియా చొచ్చుకురావడంతో దీనిని కూడా కలిపి సమగ్ర చట్టం తేవాలనుకున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
ఈ నెల 8, 9, 10 తేదీల్లో జరుగనున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే- టీజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)10వ ప్లీనరీ సన్నాహక సమావేశం బేగంపేట్లోని టూరిజం ప్లాజా హోటల్లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం అల్లం నారాయణ మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా ప్రవేశంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని చెప్పారు.
రాష్ట్రంలో సుమారు 20 వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు అందించామని తెలిపారు. కొవిడ్ సమయంలో రూ.7 కోట్ల నిధులతో 4 వేల మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశామని చెప్పారు. మలి దశ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2001లో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) ప్రస్తుతం టీయూడబ్ల్యూజేగా కొనసాగుతున్నదని, దీని రాష్ట్ర మహాసభలను, ఐజేయూ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.