హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న శుక్రవారం రాహుల్కు లేఖ రాశారు.
మహబూబ్నగర్లో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్కు చేనేత సమస్యలతోపాటు జీరో జీఎస్టీ గురించి వివరించినట్టు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీ తొలగించాలని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా చేనేతపై ఉన్న జీఎస్టీని చెల్లించాలని తాము కోరామని గుర్తుచేశారు. రాహుల్ మద్దతు తెలపడంతోపాటు జడ్చర్ల బహిరంగసభలో చేనేత కళాకారులపై పడే జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తో జీఎస్టీ భారాన్ని భరించాలని కోరారు.