చిక్కడపల్లి, నవంబర్ 12 : ప్రజలు, కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ డిసెంబర్, జనవరి నెలల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్టు సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు పద్మనాభం వెల్లడించారు. మూడు రోజులుగా బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సీఐటీయూ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా పద్మనాభం మీడియాతో మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, బ్యాంకులు, ఎల్ఐసీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. పవర్ గ్రిడ్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 2, 3 న సమ్మె నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు నవంబర్ 26తో ఏడాది పూర్తవుతున్నందున వారికి మద్దతు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, కార్యదర్శి రమ, కుమార్ పాల్గొన్నారు.