హైదరాబాద్ : దేశంలో మోదీ, అమిత్ షాల ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు రాజకీయ విధానాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాంతీయ పార్టీని జాతీయపార్టీ భారత్ రాష్ట్ర సమితిగా తీర్మానించడమే జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు. ఈ పరిణామాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్వాగతిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేతాజి సుభాష్ చంద్రబోస్ చూపిన రాజీలేని పోరాట మార్గాన్ని అనుసరించి ఎక్కడికక్కడ బీజేపీని నిలువరించడానికి తన శాయశక్తుల కృషి చేస్తారని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆశిస్తున్నదని పేర్కొన్నారు.
దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా భారత్ రాష్ట్ర సమితిని బలపర్చాల్సిన అవసరం వుందన్నారు. చిరకాలంగా కేంద్రంలో కొనసాగుతున్న ఉత్తరాది ఆధిపత్యానికి విరుగుడుగా, గుజరాతీ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి, కేవలం అదానీ, అంబానీలకు గులామ్ గిరి చేస్తూ దేశాన్ని, జాతీయ సంపదలను కార్పోరేట్లకు దోచిపెడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగట్టి బలమైన ప్రతిపక్ష ఏర్పాటుకు దక్షిణాది నుండి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లో సమర్ధవంతమైన పాత్ర పోషించగలదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. తమకు నచ్చని ప్రభుత్వాలను కూలదోస్తూ, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతూ సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఉన్మాద చర్యలతో దేశంలో అశాంతి, అసహనం, ఆందోళన, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ అప్రతిహతంగా తమ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్దపడి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అనేది అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తున్నట్లు సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.