హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎంతో సంక్షిష్టమైన కేసులను సులువుగా ఛేదిస్తూ.. తెలంగాణ సీఐడీ విభాగం అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నదని, అందులో పనిచేసే వివిధ విభాగాల సిబ్బంది రాష్ట్రం గర్వించేలా విధులు నిర్వర్తిస్తున్నారని డీజీపీ అంజనీకుమార్ కొనియాడారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖలోని ఎన్సీఆర్బీ ఇటీవల ఫింగర్ ప్రింట్ నిపుణుల కోసం జాతీయస్థాయిలో ఆలిండియా బోర్డు పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో తెలంగాణ సీఐడీలోని ఫింగర్ ప్రింట్స్ విభాగానికి చెందిన 24 మంది ఏఎస్ఐలు టాప్ ర్యాంకుల్లో నిలిచారు. టాప్ 10 ర్యాంకుల్లో (రెండో ర్యాంకు మినహా) మొత్తం తెలంగాణ ఏఎస్ఐలే నిలవడం విశేషం. డీజీపీ శనివారం తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన ఏఎస్ఐలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన వారికి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఐడీ శాఖ సాంకేతికతను ఉపయోగించి సంక్షిష్టమైన కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేస్తున్నదని అన్నారు. రాష్ట్రం అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. పోలీస్ శాఖ లా అండ్ ఆర్డర్ కాపాడటంలో సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం గొప్పదని పేర్కొన్నారు. సీఐడీ విభాగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏడీజీ మహేశ్ భగవత్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా డీజీపీ కొనియాడారు.
ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది
తెలంగాణ పోలీసు విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహం, డీజీపీ అంజనీకుమార్ మార్గనిర్దేశం వల్లనే సీఐడీ విభాగం అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నదని తెలిపారు. జాతీయస్థాయిలో మన ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐలు నిపుణులుగా గుర్తింపు పొందారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నుంచి వారు ఫింగర్ ప్రింట్ నిపుణులుగా న్యాయస్థానంలో తమ సాక్ష్యాలను సమర్పించడానికి, బాధితుల పక్షాన నిలబడటానికి వీలు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన ఏఎస్ఐలకు, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో డైరెక్టర్ ఎండీ తాతారావు, ఇన్స్పెక్టర్ సుజయ్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎన్సీఆర్బీ వెంకటేశ్వర్లు ఐపీఎస్, ఎస్పీ జీఓడబ్ల్యూ నాగలక్ష్మి, ఎస్పీ పీసీఆర్ లావణ్య, వరంగల్ ఎస్పీ ఆర్వో గంగాధర్, ఎస్పీ సీఎంఎస్ రాంరెడ్డి, ఎస్పీ అడ్మిన్ అనన్య, సీఐడీ ఎస్ఈవో మదన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.