హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రతి వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పమని, అదే తమ సిద్ధాంతం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా తమది ఓట్ల రాజకీయం కాదని.. ప్రజా సంక్షేమమే ధ్యేయమని, రాష్ట్రం బాగుపడాలనేదే లక్ష్యమని తెలిపారు. గొర్రెల యూనిట్ ధరను పెంచడమే కాకుండా, రూ.6వేల కోట్లతో రెండో విడత గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు బుధవారం ప్రగతిభవన్లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం కార్యవర్గం సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే’ అని పాడుకున్నం.. కానీ ఇప్పుడు పల్లె పల్లెనా పంట పొలాలు పచ్చగ కనిపిస్తున్నాయని వివరించారు. గొర్రెల పెంపకానికి గ్రామాల్లో షెడ్ల నిర్మాణం కోసం ఆలోచన చేస్తున్నామని అన్నారు. యాదవులు, గొల్ల కురుమలకు ఆత్మగౌరవ భవనాల నిర్మిస్తున్నామని, పశువుల కోసం సంచార వైద్యశాలలను ఏర్పాటుచేశామని తెలిపారు. గొర్రెలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని చెప్పారు. కురుమ సంఘం నేతలు మాట్లాడుతూ.. నిన్నటివరకు తాము ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, తమకు మొదటి సారి గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్ ఒక్కడేనని పేర్కొన్నారు. సీఎంను కలిసినవారిలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, నాయకులు కే నర్సింహ, అరుణ్కుమార్, నగేశ్, ప్రకాశ్ ఉన్నారు. గొర్రెల యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచడంతోపాటు రెండో విడత గొర్రెల పంపిణీకి ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్కు గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.