Telangana CEO Vikas Raj | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఐదుగురు కంటే ఎక్కువగా ఒకే దగ్గర గుమిగూడవద్దన్నారు. ప్రచారం ముగిసినందున నియోజకవర్గంలో ఓటు లేని స్థానికేతరులు వెంటనే నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని తెలిపారు.
బీఆర్కేఆర్ భవన్లో మంగళవారం అడిషనల్ సీఈవో లోకేశ్ కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణితో కలిసి మీడియా సమావేశంలో వికాస్రాజ్ మాట్లాడుతూ ఈవీఎంల మూడో విడత ర్యాండమైజేషన్ మంగళవారం రాత్రి కల్లా ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేస్తారన్నారు. ఈవీఎంల్లో సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారానికి ఇసీఐఎల్ ఇంజనీర్లు అందుబాటులోకి వచ్చారన్నారు. మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్కు, ఎన్నికల అధికారులకు ఎంతో ముఖ్యమైనదని, బహుమతులు, మద్యం, నగదు పంపిణి జరిగితే వాటిపై చర్యలు తీసుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండటానికి కంట్రోల్ రూం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు.
ఎన్నికల సామాగ్రి పంపిణి చేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశామని వికాస్ రాజ్ చెప్పారు. అక్కడే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశామని, అక్కడే ఓటు వేయవచ్చన్నారు. అక్కడే పోలింగ్ సామగ్రి కూడా అక్కడే అందిస్తామని పేర్కొన్నారు. వారికి రవాణాకు వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా సూచించిన రూట్లో కాకుండా ఎక్కడికి వెళ్లకూడదని, వేరే దారి గుండా వెళ్లవద్దని ఆయన స్పష్టం చేశారు. టీ కానీ ఇతర అవసరాలకు కూడా వాహనాలను నిలపవద్దని వెల్లడించారు.
మాక్ పోలింగ్ను నిర్వహించడానికి గురువారం ఉదయం 5.30 గంటల కల్లా అభ్యర్థుల ఏజెంట్లు రావాలని వికాస్ రాజ్ సూచించారు. ఓటరు స్లిప్పులు గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోమని, ఓటరు కార్డు లేదా ఇతర 12 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి తేవాలని వికాస్ రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీలు ఇచ్చే ఓటర్ స్లిప్పుపై అభ్యర్థి పేరు, గుర్తు, పార్టీ పేరు ఏవి ఉండకూడదని, వైట్ పేపర్పై ముద్రించిన వాటిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. హోం ఓటింగ్లో దరఖాస్తు చేసుకున్న 94 శాతం మంది ఓటు వేశారని వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు బుధవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో పోస్టల్ బ్యాలెట్ సంబంధిత నియోజకవర్గాల నుంచి సేకరించామన్నారు.
ఈవీఎంల దగ్గరికి పోలింగ్ ఏజెంట్లు వెళ్లవద్దని వికాస్రాజ్ స్పష్టం చేశారు. ఓటర్లు ఫోన్ వెంట తేవద్దని, ఓటింగ్ సీక్రెట్గా వేయాల్సి ఉంటుందని, ఓటును ఫోటో తీయడానికి వీలులేదని తెలిపారు. రాష్ట్రంలో 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తామని ప్రకటించారు. ఒకే దగ్గర ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉన్న 7571 దగ్గర బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
12 వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను 3806 సెక్టార్లుగా విభజించామని, పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయకపోయినా, ఇతర సమస్యలు ఏమైనా ఉత్పన్నమైతే వాటిని సెక్టార్ అధికారులు పరిష్కరిస్తారన్నారు. ఇప్పటి వరకు రూ.737కోట్లు విలువైన నగదు, వస్తువులు, మద్యాన్ని సీజ్ చేశామన్నారు. ఇందులో రూ.302కోట్ల నగదు, రూ.125కోట్ల మద్యం, రూ.40కోట్ల డ్రగ్స్, రూ.186కోట్ల మెటల్స్, రూ.84కోట్లు ఉచిత బహుమతులను సీజ్ చేశామన్నారు.
హోం ఓటింగ్లో 27,178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 80 ఏండ్ల వయస్సు గల వారు 15,999 మంది, దివ్యాంగులు 9,459 మంది, అత్యవసర సేవల సిబ్బంది 1,720 మంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 1.48 లక్షల మంది ఉన్నారు. 10, 191 మంది సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు డౌన్ లోడ్ చేసుకున్నారు.