హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో భూముల వివరాలు అత్యంత సురక్షితంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పోర్టల్ను పూర్తిగా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ‘తెలంగాణ స్టేట్ డాటా సెంటర్’ (టీఎస్డీసీ) నిర్వహిస్తున్నదని స్పష్టంచేసింది. అయినా ఒక వర్గం మీడియా పనిగట్టుకొని పోర్టల్పై దుష్ప్రచారం చేస్తున్నదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఇతర పోర్టళ్లను సైతం టీఎస్డీసీ నిర్వహిస్తున్నదని తెలిపింది. ఇతర ప్రాజెక్టుల మాదిరిగానే ధరణి పోర్టల్లోనూ రక్షణ చర్యలు పకడ్బందీగా ఉంటాయని వివరించింది. అధీకృత రెవెన్యూ అధికారులు మాత్రమే ధరణిలో మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది. రికార్డుల భద్రతపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని భరోసా ఇచ్చింది.