Alishetty Prabhakar | ‘పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా/ మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి’ అని ప్రకటించుకొన్న అలిశెట్టి ప్రభాకర్ అభాగ్యుల గొంతుకగా తన కవిత్వాన్ని మలిచిన ప్రజాకవి. ఉమ్మడి పాలనలో సామాన్యులకు జరిగే అన్యాయాలపై కలం పోరాటం చేసిన సృజనాత్మక జీవి. తెలంగాణ శ్రీశ్రీగా పేరొందిన అలిశెట్టి ప్రభాకర్ కుటుంబం పేదరికంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతుండటం చూసి సీఎం కేసీఆర్ చలించిపోయారు. ఆ కుటుంబానికి హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసి ఆయనపై అభిమానం చాటుకొన్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘కొందరినే కాల్చగలదు గన్/ ఎందరినో మండిస్తోంది స్లోగన్’ అంటూ తన ప్రతి అక్షరాన్ని సాయుధం చేసిన కవి అలిశెట్టి ప్రభాకర్. ‘సాగిపోవుటయే బతుకు.. ఆగిపోవుటయే చావు’ అని ప్రజాకవి కాళోజీ.. జీవితసత్యాన్ని, పరమార్థాన్ని చెప్పినట్టే ‘మరణం నా చివరి చరణం కాదు/ మౌనం నా చితాభస్మం కాదు/మనోహరాకాశంలో విలపించే /చంద్రబింబం నా అశ్రుకణం కాదు’ అంటూ మనిషితనపు లక్ష్యాన్ని ఆవిష్కరించిన ‘రక్తరేఖ’ అలిశెట్టి. అలిశెట్టి ప్రభాకర్ గుర్తురాగానే ‘తను శవమై/ ఒకరికి వశమై/ తనవు పుండై/ ఒకరికి పండై/ ఎప్పుడూ ఎడారై/ ఎందరికో ఒయాస్సిస్సై’ వంటి ఆర్తిగీతాలు తెలుగునాట అందరిమెదళ్లను మెలిపెడతాయి.
దరిద్రం అనే కవితలో ‘అకస్మాత్తుగా /ఈ అగాధాన్ని పూడ్చటం /ఎవరి తరమూ కాదు /ముందు తొంగిచూసే /గుండెనిబ్బరమన్నా / కలిగి ఉండాలి’ అని అన్నట్టే జీవితాంతం గుండెనిబ్బరంతో బతికినవాడు అలిశెట్టి. చాటుమాటుగా అర్థాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు /సంసారం బరువెంతో సమీక్షించుకునేవాడు. ‘పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా/ మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి’ అని ప్రకటించుకున్న అలిశెట్టి లేని లోటు ఆయన కుటుంబానికే కాదు నిజాయితీగా సమస్త సాహితీ అక్షరసాగు చేస్తున్నవారికీ పూడ్చలేనిది. అలిశెట్టి ప్రభాకర్ కుటుంబం పేదరికంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.
హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి, ఆయన పట్ల అభిమానం చాటుకున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుత జగిత్యాల జిల్లా)కు చెందిన అలిశెట్టి ప్రభాకర్ చిత్రకారుడుగా, ఫోటోగ్రాఫర్గా అభ్యుదయ కవిగా సమాజం కోసం నిరంతరం శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేశారు. పేదరికం మీద, మహిళా సమస్యల మీద, పల్లె, పట్నం బాధల మీద సమస్త సామాజిక రంగాల్లో అసమానతలు, అన్యాయాల మీద తన కవితాబాణాలను గురిపెట్టి కొడుతూ సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాల తరఫున బాధ్యత కలిగిన సైనికుడిగా అక్షర పోరాటం చేశాడు. సమాజం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి తనువు చాలించిన అలిశెట్టి ప్రభాకర్ భార్య, పిల్లలు నేడు పేదరికంలో మగ్గుతుండటం, భార్య భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వారికి సరియైన విధంగా సహాయం అందించే చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ను ఆదేశించారు.
వెంటనే స్పందించిన కేటీఆర్.. అలిశెట్టి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించేందుకు అధికారులను పురమాయించారు. జియాగూడలోని అసిఫ్నగర్లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యమ్మకు ఇల్లు కేటాయిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తమకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించినందుకు అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యమ్మ, కుమారులు సంగ్రామ్, సంకేత్.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్జతలు తెలిపారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం కవులు, గాయకులు, కథకులను అక్కున చేర్చుకొని కండ్లకు అద్దుకున్నది. ప్రముఖ కవి, కథకుడు కేవీ నరేందర్ అనారోగ్యం పాలైతే కేసీఆర్ రూ.15 లక్షలను సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చి ఆదుకున్నారు. పైడి తేరేశ్బాబు మరణించినప్పుడు సీఎం కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత సినారె మరణించినపుడు రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. సీఎం కేసీఆర్ స్వయంగా సినారె పాడేమోశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ పార్థీవదేహాన్ని మోసి అన్నీ తానై వ్యవహరించారు.
ఉద్యమకవులు, ప్రజాగాయకులకు తెలంగాణ సర్కార్ ప్రత్యేకించి సాహితీవల్లభుడైన సీఎం కేసీఆర్ అక్షరగొడుగు పట్టారు. ప్రజాకవి కాళోజీ, దాశరథి పేరిట తెలంగాణలోని ప్రజాకవులు, గాయకులకు అవార్డులు అందజేసి సర్కార్ గుండెలకు అద్దుకున్నది. ప్రజాకవి గోరటి వెంకన్న, కవిగాయకుడు దేశపతి శ్రీనివాస్ను ఎమ్మెల్సీలుగా చేసి కేసీఆర్ సర్కార్ ప్రజాకవులకు పట్టం కట్టింది. తెలంగాణ ఉద్యమంలో ఊరూరా ధూం..ధాం చేసిన రసమయి బాలకిషన్ రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, తెలంగాణ సాంస్కృతిక సారధిగా నియమించినా అది సీఎం కేసీఆర్కే సాధ్యం అనే భావన కళాకారుల్లో నెలకొన్నది. ఇటవలే ప్రజాకవి జయరాజ్ను రాష్ట్ర ప్రభుత్వం ‘కాళోజీ’ అవార్డుతో సత్కరించడం విశేషం.
జానపద వాగ్గేయకారులకూ..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లల్లోనే సీఎం కేసీఆర్.. ఒగ్గుకథకు నెలవంక చుక్కా సత్తయ్యకు నెలనెలా రూ.10వేల పింఛన్ను మంజూరు చేశారు. ఏడుమెట్ల కిన్నెర వాయిద్యకారుడు కిన్నెర మొగిలయ్యకు హైదరాబాద్లో ఇంటిస్థలం, రూ.1 కోటి ఆర్థిక సాయాన్ని అందించటమే కాకుండా నెలకు రూ.10 వేల పింఛన్ అందించారు. దేశజానపద వేదికపై తెలంగాణ కీర్తికిరిటాన్ని ఎగురవేసి పద్మశ్రీ అవార్డులు స్వీకరించిన గుస్సాడి కనుకరాజు, సకిని రామచంద్రయ్యకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు.