హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నిక ఇంకా పదిరోజుల్లో జరుగుతుందనగా కమలం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. రెండురోజుల్లో ముగ్గురు కీలక నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీ అధిష్ఠానం నానా హైరానా పడుతున్నది. పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని, వాటిని తట్టుకోలేకే బయటకు వస్తున్నామని వారు చెబుతుండటం పరిస్థితికి నిదర్శనం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు.. ఇలా అన్ని స్థాయిల నేతలు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. బీజేపీ చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదని ఆ పార్టీ నేతలే అంటుంటారు. ఎమ్మెల్యేలను అంగట్లో పశువుల మాదిరి కొనుగోలు చేసి దాదాపు 8 రాష్ర్టాల ప్రభుత్వాలను పడగొట్టింది. ఈ దుష్ట, విష సంప్రదాయాన్ని తెలంగాణకు సైతం విస్తరించింది. ఇందుకు రాజగోపాల్రెడ్డి ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. రూ.18వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి ఆయనతో రాజీనామా చేయించింది. సీఎం కేసీఆర్ను అడ్డగోలుగా తిట్టడమే తప్ప తెలంగాణ సమాజానికి మేలు చేద్దామన్న ప్రణాళిక వారి వద్ద లేనేలేదని అర్థమవుతున్నది.
బయటి నేతలకు విలువ ఉండదు
బీజేపీలో మొదటి నుంచి ఉన్నవారికి, సంఘ్తో సంబంధం ఉన్నవారికే విలువ ఉంటుంది. బయటి నేతలకు పెద్దగా విలువ ఇవ్వరు. వేదికపై కూర్చునే అవకాశం రాదు. మాట్లాడే అవకాశం ఇవ్వరు. ప్రతీదానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా బడుగు, బలహీన వర్గాల నాయకులకు అస్సలు విలువ ఇవ్వరనే వాదన కూడా ఉన్నది. బడాబాబులకు, కాంట్రాక్టర్లకే రెడ్కార్పెట్ పరుస్తారని అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ‘బండి’ పైత్యం మరో ఎత్తు. ఆయన ఒంటెత్తు పోకడ, నియంతృత్వ ధోరణితో నాయకులు విసిగిపోతున్నారు.
మునుగోడులో జుగుప్సాకరంగా..
మతతత్వ బీజేపీ అసలు రంగు మునుగోడులో బయటపడుతున్నది. డబ్బు, పదవులు ఆశ చూపెట్టి, ప్రలోభపెట్టి ఒకరిద్దరు నాయకులను చేర్చుకోవడం, రూ.కోట్ల నగదు తీసుకొనిరావడం, ఓటర్లకు మద్యం, మాంసం, డబ్బు పంచుతూ ప్రలోభపెట్టడం వంటివి జుగుప్సాకరంగా మారాయి. దీనికితోడు అమలు సాధ్యం కాని హామీలు గుప్పిస్తుండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతున్నది. అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో గుర్తించడంలో కూడా బీజేపీ నేతలు విఫలమయ్యారని వారికి అర్థమవుతున్నది. దీంతో వరుసగా కీలక నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. రెండు రోజుల కిందట ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గుడ్బై చెప్పగా, తాజాగా మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ బీజేపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరారు. దీనికొకరోజు ముందే మునుగోడు బీజేపీలో కీలకంగా ఉన్న పాల్వాయి గోవర్ధన్ (జూనియర్), మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు, చౌటుప్పల్కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లతోపాటు గడిచిన వారం రోజుల్లోనే పదుల సంఖ్యలో నేతలు టీఆర్ఎస్లో చేరారు.
కమలంలో గ్రూపుల లొల్లి
బీజేపీలో గ్రూపుల పంచాయితీ తారస్థాయికి చేరిందని పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకొంటున్నారు. కొత్తగా వచ్చినవారెవ్వరూ ఇమడలేకపోతున్నారని, బండి సంజయ్ నేతలను విభజిస్తున్నారని, తనవర్గం కానివారిని అణచి వేస్తున్నారన్న భావన పార్టీలో బాగా పెరిగిపోయింది. ఈటల రాజేందర్, కిషన్రెడ్డి, మిగిలిన సీనియర్లు వర్గాలుగా విడిపోయారు. ఈ వర్గపోరు భరించలేని నేతలు ఒక్కొక్కరుగా జారుకొంటున్నారు. త్వరలో మరో ఇద్దరు కీలక నేతలు బీజేపీని వీడబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
బండి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం
పార్టీని వీడిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్లు మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ నియమించిన స్టీరింగ్ కమిటీ సభ్యులు. కేంద్ర చేరికల కమిటీలో కూడా వీరు కీలకంగా ఉన్నారు. వరుసగా పార్టీని వీడుతుండటంతో బండి సంజయ్ ఆధ్వర్యంలో నేతలు మునుగోడులో ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది.