Glucose Bottle | మహబూబాబాద్ : రోగులకు ఎక్కించే గ్లూకోజ్ బాటిల్లో నాచు ప్రత్యక్షమైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెలుగు చూసింది.
దంతాలపల్లి మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన నరకుటి సునీత అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. డాక్టర్ అందుబాటులో లేరని చెప్పి, అక్కడున్న సిబ్బంది ఓ రెండు గ్లూకోజ్ బాటిల్స్ను రోగికి అందజేశారు. ఇంటికి వెళ్లి గ్లూకోజ్ ఎక్కించుకోవాలని ఆమెకు సూచించారు. బాధితురాలు ఇంటికి చేరుకుని, గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ను సంప్రదించింది. ఒక గ్లూకోజ్ బాటిల్లో నాచు ఉండడాన్ని ఆర్ఎంపీ డాక్టర్ గమనించి, ఆమెకు సూచించాడు. దీంతో షాక్కు గురైన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఆరోగ్య శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.