రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో భారీగా ఆల్ఫాజోలం (Alfazolam) పట్టుబడింది. కొత్తూరులో ఆల్ఫాజోలం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కిలో ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.15 లక్షలు ఉంటుందని చెప్పారు. ముఠాలో ముగ్గురిని పట్టుకున్నామని, మరొకరు తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. మూడు ఫోన్లు, కారును సీజ్ చేశామని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా, అనిల్ గౌడ్ అనే వ్యక్తి ఏడాది క్రితం సుధాకర్, శరత్బాబులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. అంతా కలిసి నాగర్ కర్నూలుకు చెందిన నర్సింహులు అనే వ్యక్తి నుంచి ఆల్ఫాజోలం సేకరిస్తున్నారని తెలిసింది. దానిని చుట్టుపక్కల జిల్లాల్లోని కల్లు దుకాణాలకు అమ్ముతున్నట్లు వెల్లడైంది. పట్టుబడిన కిలో ఆల్ఫాజోలం సుమారు 6 లక్షల లీటర్ల కల్లులో కలపడానికి సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు.