కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 642.80(3.90 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన ప్రాజెక్టులోకి మూడు రోజులుగా 2062.94 క్యూసెక్కుల ఇన్ఫ్లో నిలకడగా వస్తోంది.48 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుంది.
ఇన్ఫ్లో వస్తున్నందు వలన కుడి, ఎడమ కాలువలకు కలిపి 94 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులుగా ఉంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో జూలై 14 నుంచి 27 వరకు 14 రోజులలో ప్రాజెక్టు నుండి 6.60 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు.
ప్రాజెక్టు నిర్మించిన నాటి నుండి జూలై నెలలో ఈ స్థాయిలో దిగువకు నీటిని వదలడం ఈ ఏడాదే ప్రథమం. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఆగస్టు, సెప్టెంబరు నెలలో వచ్చే వర్షాల తో ఎక్కువ శాతం నిండేది. ఈ నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు జూలై నెల నుంచి 638.05 అడుగులుగా నీటి నిల్వను కొనసాగిస్తూ,
ఎగువ నుంచి వచ్చే ఇన్ఫ్లోను కాలువలకు వదులుతూ ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించారు. గత మూడు రోజులుగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన ఇన్ఫ్లో పెరగడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువగా వచ్చింది.
అప్రమత్తంగా ఉండాలి
మూసీకి వరద ఉధృతి పెరుగుతుండటంతో ఏ సమయంలోనైనా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు ఏఈ ఉదయ్ తెలిపారు. పరివాహక ప్రాంత రైతులు ఎవరూ నది లోకి వెళ్లవద్దని విఙప్తి చేశారు. గొర్రెలు, పశువుల కాప రులు, మత్స్యకారులు, వ్యవసాయ మోటార్లు ఉన్న రైతులు నదిలోకి వెళ్లవద్దని కోరారు.