మానవపాడు, నవంబర్ 23: అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్కు గురువారం నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ఒక్కొక్కరు పదుల సంఖ్యలో లబ్ధి పొందారని, నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు రాలేదని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి గ్రామ ప్రజలు నిలదీశారు. సంపత్కుమార్ బోరవెల్లిలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని చెప్పారు.
అదే గ్రామానికి చెందిన వెంకటన్న మరికొందరు కలిసి సంపత్కుమార్ను నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు కాలేదని అన్నారు. అక్కడే ఉన్న సంపత్ అనుచరులు వెంకటన్నను తోసుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న నమస్తే విలేకరి వద్దకు సంపత్ అనుచరులు వచ్చి సెల్ఫోన్ లాక్కునే యత్నం చేశారు. విలేకరిపై దాడికి యత్నించారు. అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.