Sand Mafia | జఫర్గఢ్, ఫిబ్రవరి 19: జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని ఆకేరువాగు పరీవాహక ప్రాంతం ఇసుక అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఉప్పుగల్లు శివారులో ఆకేరువాగుపై రిజర్వాయర్ నిర్మాణంతో కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న ఇసుక రవాణా ఇటీవల మళ్లీ ఊపందుకున్నది.
ఉప్పుగల్లు, కూనూరు, కోనాయిచలం, తిడుగు గ్రామ శివారులో ఆకేరువాగు పరీవాహక ప్రాంతం కావడంతో ఇసుక లభిస్తున్నది. ఉప్పుగల్లు శివారులో ఆకేరువాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.270 కోట్లతో రిజర్వాయర్ నిర్మించింది. అంతకుముందు రిజర్వాయర్ ప్రాంతంలోని ఇసుకను అక్రమార్కులు కొన్నేండ్లపాటు అక్రమంగా తరలించారు.
ఆ తర్వాత రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి నీటితో నిండడంతో ఇసుక రవాణకు అడ్డుకట్ట పడింది. గత వానకాలంలో వర్షాలు కురిసి వాగులోకి ఇసుక కొట్టుకురావడంతో అక్రమార్కుల కన్ను మళ్లీ ఇసుకమేటలపై పడింది. యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇసుకను తరలించుకుపోవడంతో ఆకేరువాగు పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్ల నుంచి నీళ్లు రావడం లేదని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు.
కఠిన చర్యలు తప్పవు: మహేందర్, ఎస్ఐ
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆకేరువాగు నుంచి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 20 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశాం. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే పోలీసులకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం.