హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ, అధికార పక్షం మధ్య తీవ్ర మాటల యు ద్ధం జరిగింది. ముస్లింల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని అక్బరుద్దీన్ పేర్కొనగా.. ఎంఐఎం ఎమ్మెల్యేలు ముస్లింలందరికీ ప్రతినిధులు కాదని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అనేక అంశాలపై ఇద్దరి మధ్య చర్చ వాడివేడిగా సాగింది. జూబ్లీహిల్స్లో ఎంఐ ఎం పోటీపై అధికారపక్షం, సీఎం రేవంత్రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఎంఐఎం చేసిన వ్యాఖ్యలతో సభ ఒక్కసారిగా హీటెక్కింది. ఈ క్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు రెండుసార్లు వెల్లోకి దూసుకెళ్లారు. సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.
అక్బరుద్దీన్ ఒవైసీ తన నియోజకవర్గానికి సబ్స్టేషన్లు, కేబుళ్లు మంజూరు చేయాలని, సరఫరా సామర్థ్యాన్ని పెం చాలని కోరారు. ఈ చిన్న చిన్న పనులను పదేపదే అడగాల్సి రావటం తనకు సిగ్గుగా ఉన్నదని అన్నారు. ఈ సమయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అడ్డు తగిలారు. ‘మీరు పదేండ్లుగా ప్రభుత్వంలో ఉన్నారు. ఈ చిన్నచిన్న పనులను కూడా అడగలేదా?’ అని ప్రశ్నించారు. దీంతో అక్బరుద్దీన్ పెద్దోళ్లు మాట్లాడుతుంటే పిల్లలు జోక్యం చేసుకోవద్దు. కొత్త సభ్యుడు ఇంకా ఎంతో నేర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. ముస్లింల తరఫున మాట్లాడుతున్న ఎంఐఎంను ఖతం చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆరోపించారు. ‘మమ్మల్ని భయపెడదామని అనుకుంటున్నారా? మేం లొంగిపోం. కిరణ్కుమార్రెడ్డి జైలులో పెట్టినా, నగర బహిష్కరణ చేసినా భయపడలేదు. ఇప్పు డు మీరు మళ్లీ జైలులో పెట్టాలనుకుంటే మేం సిద్ధంగా ఉన్నాం?. మేం ఎవరినీ బతిమిలాడం. ముస్లింల వాణిని తెలంగాణలో ఎవరూ ఆపలేరు’ అని తేల్చి చెప్పారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అని పలుమార్లు అక్బరుద్దీన్ చెప్పారని, అందుకే తాము వారిని వేర్వేరుగా చూడటం లేదని అన్నారు. ముస్లింలందరి తరఫున మాట్లాడుతున్నట్టు అక్బరుద్దీన్ చెప్పడం సరికాదని, ఆయనకు హిందువులు కూడా ఓటేశారని అన్నారు. ‘జూబ్లీహిల్స్ నుంచి ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆయనపై ఎంఐఎం నుంచి మరో ముస్లింను నిలబెట్టి ఓడగొట్టారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీకి టికెట్ ఇద్దామని అనుకుంటే.. అక్బరుద్దీన్ ప్రాణ స్నేహితుడు కేసీఆర్ అక్కడ ఎన్నికల్లో నిలబడితే సహకరించారు. అలాంటి వ్యకి ముస్లింలందరికి ప్రతినిధిగా ఎలా చెప్పుకుంటారు?’ అని ప్రశ్నించారు. కవ్వంపల్లి సత్యనారాయణ దళితుడని, ఎంఐఎం నేతలంతా కలిసి ఒక దళితుడిని ఇలా అవమానించడం సరికాదని అన్నారు. తమకు మైక్ ఇవ్వాలని ఎంఐఎం సభ్యులు కోరగా.. స్పీకర్ అనుమతించలేదు. దీంతో వారు వెల్లోకి దూసుకొచ్చారు.
రాష్ట్రంలో విద్యుత్తు బకాయిలు చెల్లించని ప్రాంతాల్లో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. సిద్దిపే ట డివిజన్లో 61.37%, గజ్వేల్ డివిజన్లో 50.29%, హైదరాబాద్ సౌత్లో 43 శాతం సరఫరా నష్టాలు ఉన్నాయని తెలిపారు. విద్యుత్తు రంగం దివాలా తీయడానికి ఈ మూడు ప్రాంతాలే కారణమని అన్నారు. హరీశ్రావు, కేసీఆర్, అక్బరుద్దీన్ ఒవైసీ వారి ప్రాంతాల్లోని మొండి బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మైనార్టీల సంక్షేమం గురించి ఎవరి దగ్గరా నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదని అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చామని అన్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ స్పందించారు. రాజకీయ పార్టీలకు నచ్చిన చోట పోటీ చేసే హక్కు ఉంటుందని తెలిపారు. ‘మా నియోజకవర్గాల్లో మాపై పోటీగా కాంగ్రెస్ తరఫున ముస్లింలకు టికెట్లు ఇచ్చారు. అలాగని మీరు ముస్లింలను గెలవనీయకుండా ప్రయత్నించారని నిందించాలా? ఇదేం ఇమ్మెచ్యూర్ టాక్ (అపరిపక్వ వ్యాఖ్యలు)’ అని ఘాటుగా స్పందించారు. అంబేద్కర్ ఓటమికి కా రణం ఎవరో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిందన్న వ్యాఖ్యలపై అ భ్యంతరం తెలిపారు. ఆ సమయంలో రేవంత్ కాంగ్రెస్లో లేరని, ఎక్కడున్నారో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. కాం గ్రెస్ ఇచ్చిన గృహజ్యోతి పథకం అమలు చేస్తే ఎంత ఆర్థిక భారం పడుతుందనేదానిపై ప్రభుత్వం ఏమైనా కసరత్తు చేసిందా అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. తన అంచనా ప్రకారం ఏటా రూ.4,800 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇస్తుందా? లేక ఇతర క్యాటగిరీల్లో చార్జీలు పెం చుతుందా? అని ప్రశ్నించారు. డిస్కంల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలన్నారు.అనేక అంశాలు శ్వేతపత్రంలో లేవన్నా రు. ‘ఆర్థిక శ్వేతపత్రంలో విద్యుత్తు అప్పులు రూ. 82,893 కోట్లుగా చెప్పారు. విద్యుత్తుపై శ్వేతపత్రంలో అప్పు రూ.78,554 కోట్లుగా ఉన్నది. ఈ తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారంలో మునుగుతుందని, కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని నాడు ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అవమానించారని అక్బరుద్దీన్ గుర్తు చే శారు. 2014 నాటికి ఉమ్మడి ఏపీలో విద్యుత్తు రం గం దారుణంగా ఉండేదని, క్రాప్ హాలిడేలు ప్రకటించారని గుర్తుచేశారు. అప్పుల బాధతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. 10వేల పరిశ్రమలు మూతబడ్డాయని,జనరేటర్లు, కన్వర్టర్లు, ఇన్వర్టర్లు ప్రతి ఇంటిలో కనిపించేవని చెప్పారు. కానీ కేసీఆర్ హయాంలో ఎవరూ ఊహించని విధంగా మారిపోయిందని చెప్పారు.