హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎంఐఎం పార్టీ శాసనసభాపక్షనేతగా ఆ పార్టీ సీనియర్ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్షనేతగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. వీరిద్దరిని శాసనసభాపక్ష నేతలుగా (ఫ్లోర్లీడర్లు) గుర్తిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సభలో 8 మంది సభ్యులుండగా, ఆ పార్టీ ఇంతవరకు ఎల్పీ లీడర్ను ఎన్నుకోలేదు.
అసెంబ్లీలో చర్చల సందర్భంగా విపక్ష సభ్యులు అడిగినవాటికి క్లారిఫికేషన్స్కు అవకాశమివ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. సభలో నిర్మాణాత్మక చర్చలు జరిపి ప్రజలకు మంచి సంకేతాలు పంపించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఆటంకం కలిగించొద్దని, రన్నింగ్ కామెంటరీలు చేయెద్దని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సభ్యులకు సూచించారు. చర్చలు జరుగుతున్నప్పుడు వ్యాఖ్యానాలు చేయవద్దని కోరారు. ప్రస్తుత సభలో విశేషమైన అనుభవం ఉన్నవారితోపాటు 57 మంది కొత్త సభ్యులు ఉన్నారని తెలిపారు. అనుభవజ్ఞుల ప్రసంగాలు కొత్తవారు పరిణతి సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు. సభాపతికి సహకరించి సభ హుందాతనాన్ని, గౌరవాన్ని రక్షించాలని కోరారు.