హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంపద తరలిపోకుండా కాపాడుకుందామని సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ పిలుపునిచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీకి పట్టంగట్టిన కార్మికులందరికీ ఒక ప్రకటనలో వారు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో సింగరేణిని బతికుంచుకోవాలనే పట్టుదలతో ఏఐటీయూసీని సుమారు 3 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణి పరిధిలో కొత్త మైన్స్ను తీసుకరావడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. మైన్స్ ప్రైవేట్పరం కాకుండా, సింగరేణి పరిధిలోనే ఉండేలా పోరాడుతామని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడికి సొంతిల్లు, ఇతర సౌకర్యాల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి సంపదను దారిమళ్లించి, దుర్వినియోగం చేసిన అధికారులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ విజయానికి పాటుపడిన ప్రతిఒకరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.