హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో ఆగస్టు 9న ‘మహాపడావ్’ (మహా ధర్నాలు) నిర్వహించనున్నట్టు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్కౌర్ వెల్లడించారు. క్విట్ ఇండియా రోజున జరిగే ఈ కార్యక్రమంలో ‘సేవ్ నేషన్.. సేవ్ పీపుల్’ నినాదంతో ఈ మహాధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ సత్యనారాయణరెడ్డి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్కౌర్ మాట్లాడుతూ ‘మహాపడావ్’ సన్నాహాక కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయిలో సదస్సుల ను నిర్వహిస్తున్నామని, ‘సేవ్ ఇండియా.. సేవ్ పీపుల్’ నినాదంతో, ‘మహాపడావ్’ ఉద్దేశాన్ని ప్రతి ఇంటికీ, ప్రతి పరిశ్రమకూ చేరేలా ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు వివరించారు. బీజేపీని గద్దె దించేందుకు నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు గిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ చంద్రయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం నర్సింహా, కార్యదర్శులు ఎన్ కరుణకుమారి, బీ వెంకటేశం, రాష్ట్రసమితి సభ్యుడు బొడ్డుపల్లి కిషన్ పాల్గొన్నారు.