హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా లక్నో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆవిర్భవించిందని, నాటి నుంచి 90 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ మాత్రమే అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో జూన్ 4 నుంచి 6 తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, సైద్ధాంతిక, రాజకీయ శిక్షణ తరగతులను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సమాజానికి అవసరమైన ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు ఇచ్చేది చదువే అని, అలాంటి విద్యను నేటి పాలకులు భ్రష్టుపట్టిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ఎ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీఉల్లాఖాద్రి, మంద పవన్, రమావత్ అంజయ్య నాయక్, పల్లె నరసింహ, మారుపాక అనిల్ కుమార్, లక్ష్మీ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, కాసోజు నాగజ్యోతి, వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.