హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): నిజాం కాలం నాటి ఎయిర్పోర్టు అది.. 748 ఎకరాల భూమి.. ఆ నాడే దేశంలోనే అతి పెద్ద రన్వే కలిగిన చరిత్ర.. సమైక్య పాలనలో వివక్షకు గురై మళ్లీ ఇప్పుడు విమానాలకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమవుతున్నది. వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్పోర్టు నుంచి ఎలాగైనా విమాన రాకపోకలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నది. ఈ మధ్య వరంగల్ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్..
ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అధికారులతో మాట్లాడి త్వరగా ఇక్కడ రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని తర్వాత ఎయిర్పోర్టుల వ్యవహారాలు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ ఢిల్లీకి వెళ్లి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులతో మాట్లాడారు. మామునూర్లో కార్యకలాపాలు సాగించేలా చర్చించారు. పెద్ద విమానాలు రాకపోకలు సాగించాలంటే మరో 438 ఎకరాల భూమి అవసరం అవుతుందని ఏఏఐ చెప్పటంతో, చిన్న ఎయిర్క్రాప్ట్ల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. దీనికి ఏఏఐ అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఏఏఐ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వరంగల్ జిల్లాకు తిరిగి విమాన సర్వీసులు నడిచే అవకాశం ఉన్నది.
నిజాం పాలనలో తెలంగాణలో 6 ఎయిర్పోర్టులు ఉండేవి. హకీంపేట, దుండిగల్, బేగంపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్పోర్టులు ఉండేవి. ఈ ఎయిర్పోర్టుల్లో నిత్యం కార్యకలాపాలు జరిగేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్లోని మూడు ఎయిర్పోర్టుల్లోనే కార్యకలాపాలు సాగుతున్నాయి.
1985 వరకు మామునూర్ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలు జరిగాయి. ఆ తర్వాత దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆధునీకరించేందుకూ చర్యలు తీసుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం జిల్లాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేసి, జిల్లాలకు విమాన సర్వీసులు నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2017 జనవరి 11న కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు విమాన సేవలు విస్తరించాలని అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. ఆనాటి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఒప్పందం చేసుకొన్నాయి. దీని ప్రకారం వరంగల్ జిల్లా మామునూర్తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, మహబూబ్నగర్జిల్లా దేవరకద్రలో (ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకం ఉడాన్ స్కీమ్ కింద) ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయాలి.