హైదరాబాద్: కేంద్రం రాష్ట్రాల వాటా హక్కు నిధులు సరిగ్గా ఇవ్వడం లేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. కేంద్రం చేసిన అప్పుల ముందు రాష్ట్రం అప్పులు పిసరంత అని వెల్లడించారు. తెలంగాణ అప్పుల గురించి కేంద్రం గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. శాసనసభలో బడ్జెట్పై చర్చను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రారంభించారు. రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావుకు అభినందనలు తెలిపారు.
పునర్ విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని విమర్శించారు. కేంద్ర పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్కు 2/3వ వంతు, తెలంగాణకు 1/3 వంతు మాత్రమే ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మతంపేరుతో విషం నింపడం కంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు.