పెబ్బేరు/ఖిల్లాఘణపురం, అక్టోబర్ 10: దేశంలోనే మాడల్ జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి సమీపంలోని చింతలకుంట ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి మంత్రి పూజలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని అర్చకులు వేదమంత్రాతో ఆశీర్వదించారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని కార్యకర్తల మధ్య కూర్చొని మంత్రి వీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మహాయజ్ఞంలా జరిగాయని తెలిపారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే.. రానున్న ఎన్నికల్లో విజయం సులభమవుతుందని చెప్పారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 70 వేల సభ్యత్వాలు ఉన్నాయని, ప్రతి ఇంటికీ ఏదో రూపంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. అలాగే ఖిల్లాఘణపురం మండలం గట్టుకాడిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి నిరంజన్రెడ్డి పూజలు చేశారు.