హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): వైద్య సాంకేతిక రంగంలో హైదరాబాద్లోని ఏఐజీ దవాఖాన మరో విప్లవం సృష్టించింది. ఆసియా, పసిఫిక్లోనే తొలిసారిగా ‘వివాస్కోప్’ అనే సరికొత్త ఇన్స్టంట్ పాథాలజీ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా బయాప్సీ ఫలితాలు రావాలంటే కనీసం 5 రోజుల సమయం పడుతుంది.
కానీ వివాస్కోప్ పద్ధతి ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు తెలుసుకోవచ్చని ఏఐజీ దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి వెల్లడించారు. వివాస్కోప్ ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడారు. వివాస్కోప్ ద్వారా బయాప్సీ ఫలితాలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోవచ్చని, దీని వల్ల సరైన సమయంలో రోగ నిర్ధారణ జరిపి, రోగికి సకాలంలో చికిత్స అందించే వీలుంటుందని తెలిపారు.
జీఐ క్యాన్సర్కు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో ఈ పద్ధతి కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఐజీ డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు, పాథాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ వివాస్కోప్ పద్ధతి వైద్యరంగంలో కొత్త శకాన్ని నిర్వచిస్తుందని, వేగవంతమైన బయాప్సీ ఫలితాలతో స్పష్టమైన వ్యాధి నిర్ధారణ, ఆపరేషన్ థియేటర్లోనే చికిత్స ప్రణాళికపై నిర్ణయం తీసుకునేలా వైద్యులకు తగిన సమాచారం అందుతుందని చెప్పారు.