హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవికి కాంగ్రెస్ కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పీసీసీ డెలిగేట్గా పేర్కొంటూ 2027 వరకు చెల్లుబాటు అయ్యేవిధంగా ఈ కార్డును ఇచ్చింది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తరువాత చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా, కొంతకాలం కేంద్రమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో విడుదల కానున్న గాడ్ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అంటూ ట్విట్టర్లో చేసిన పోస్టు అనేక ఊహాగానాలకు దారితీసింది.