వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 22: వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల భూములపై కన్నేసిన సీఎం రేవంత్రెడ్డి దిగివచ్చే వరకు ఉద్యమాలు కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. వర్సిటీ విలువ తెలిసిన ప్రతి ఒక్కరు విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని, లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి సోమవారం ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో 55ను తక్షణం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి తాము అండగా ఉంటామని పేర్కొన్నారు.
డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేశ్ మాట్లాడుతూ విద్యార్థి నాయకులను ఉన్నతాధికారులు టార్గెట్ చేయడం మానుకోవాలని హెచ్చరించారు. వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమని పేర్కొన్నారు. అంతకుముందు విద్యార్థులు మాట్లాడుతూ దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నం పెడుతున్న యూనివర్సిటీని చీల్చడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రేవంత్రెడ్డి ఈ విషయంలో మరోమారు ఆలోచించాలని డీవైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బీ శంకర్ కోరారు. విద్యార్థుల నిరసన సోమవారంతో 14వ రోజుకు చేరుకుంది. రాజేంద్రనగర్తోపాటు పాలెం, వరంగల్, సిరిసిల్ల, అశ్వారావుపేట, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల విద్యార్థులు కూడా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కళాశాల విద్యార్థి సంఘాల నాయకులు రాజ్కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్రెడ్డి, వినయ్రెడ్డి, శంకర్నాయక్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.