హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయం దీనస్థితిలో ఉండేదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ అనుకూల విధానాల వల్లే రాష్ట్రంలో రికార్డుస్థాయిలో పంట ఉత్పత్తులు నమోదవుతున్నాయని, వ్యవసాయ సుస్థిరత సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘స్మార్ట్ అగ్రి సమ్మిట్- 2022’కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి ‘సాంకేతికతతో కూడిన సుస్థిర వ్యవసాయం’ అన్న అంశంపై ప్రసంగించారు.
రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని, ఒకవైపు సాగునీటి వసతులు కల్పిస్తూ, సకాలంలో ఎరువులు, మందులు సరఫరా చేస్తున్నదని చెప్పారు. రైతుబంధు, రైతుబీమాతో భరోసా కలిస్తున్నామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలను పటిష్టపరచడంతో భూగర్భజలాలు పెరిగాయని వెల్లడించారు. రుణమాఫీ, సాగుకు ఉచిత కరెంటు, అందుబాటులో విత్తనాలు, ఎరువులు అందించడం ద్వారా రాష్ట్రంలో 2 కోట్ల 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని, వానకాలంలో 68 లక్షల వరి సాగైందని వివరించారు. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి జాతి సంపద పెంపునకు దోహదపడుతున్నా కేంద్ర సహకారం లేకపోవడం దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుబీర్ చక్రవర్తి, జాతీయ వర్షాధార ప్రాంతాల అభివృద్ధి అథారిటీ చైర్మన్ అశోక్ దల్వాయి, సచిన్శర్మ, రామ్ కౌండిన్య, చంద్రశేఖర్, నాబార్డు సీజీఎం సుశీల చింతల, అప్మా ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, జయంత చక్రవర్తి పాల్గొన్నారు.