వనపర్తి, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో శాశ్వతంగా నీటి కరువును తీర్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. జలవనరులకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో రూ.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రణాళికలతో చెరువులు, కుంటల పునరుద్ధరణ, వాగులు, వంకలపై చెక్డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వివరించారు. తెలంగాణలో ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టేందుకు సీఎం నడుం బిగించారని తెలిపారు. నదీజలాలను సద్వినియోగం చేసుకునేందుకే కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలు గర్వపడేలా రాష్ట్రంలో ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. పంటమార్పిడితో అనేక ప్రయోజనాలున్నాయని, ఆయిల్పాం, కూరగాయల సాగుతో అధిక ఆదాయం పొందొచ్చని మంత్రి రైతులకు సూచించారు.