హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ)/ వ్యవసాయ యూనివర్సిటీ: అధిక సాంద్రత విధానం, ఒకే కాపులో కోతకు వచ్చే పత్తి (సింగిల్ పిక్) సాగును ప్రోత్సహించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పద్ధతిలో తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడి సాధించడంతో పాటు సాగు నీరు కూడా ఆదా అవుతుందని వివరించారు.
పత్తిని తెంపడంలో కూలీల కొరతను అధిగమించవచ్చునని, యాంత్రీకరణకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కొత్త విధానాన్ని ప్రోత్సహించే ముందు ఆ భూములు అనుకూలమా? కాదా? అనేది నిర్ణయించాలని సూచించారు. సాగుకు యోగ్యమైన భూములు గల రైతులను మాత్రమే ప్రోత్సహించాలని స్పష్టంచేశారు. తొందరపడి పత్తి విత్తనాలను నాటొద్దని, రెండో వాన తర్వాతే పత్తిసాగుకు సిద్ధం కావాలని రైతులకు సూచించారు.
ప్రస్తుతం ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా పత్తి ఉత్పత్తి కావడం లేదని తెలిపారు. దేశంలో పత్తిసాగులో మహారాష్ట్ర మొదటి స్థానంలో, తెలంగాణ 2వ స్థానంలో, గుజరాత్ 3వ స్థానంలో ఉన్నాయని పేరొన్నారు. చైనాతో పోల్చుకొంటే ఉత్పాదకత విషయంలో మన దేశం వెనకబడి ఉన్నదని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకొంటే ప్రపంచ అవసరాలకు సరిపోయే పత్తిని మన దేశంలోనే ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు.
వ్యవసాయంలో సాంకేతికత పెరగాలి
వ్యవసాయరంగంలో యాంత్రీకరణతో పాటు సాంకేతికతను సంపూర్ణంగా వినియోగిస్తే రైతులకు మేలు జరుగుతుందని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను కోరినట్టు తెలిపారు. మార్కెట్ అవసరాలు, డిమాండ్ ఉన్న పంటలను పండించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.