Adilabad | ఆదిలాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ‘మేమిద్దరం.. మాకిద్దరు’అనేలా రైతు కాకేర్ల ఆశన్న(45)ది మధ్య తరగతి కుటుంబం. ఆశన్నకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇద్దరు పిల్లలతో హాయిగా సంసారం సాగుతోంది. ‘పిల్లలిద్దరూ పెద్దగవుతున్నారు. వారు మనలెక్క ఎవుసం చేయొద్దు.. మంచి ఉద్యోగాలు చేయాలి’.. అంటూ భార్య సుచరితకు ఆశన్న తరుచూ చెప్తుండేవాడు. పిల్లల చదువుల ఫీజులు.. రోజు రోజుకు పెరుగుతున్న ధరల మధ్య ఆశన్న మధ్యతరగతి బండి ముందుకు సాగడం కష్టం అవుతున్నది. దీంతో రెక్కల కష్టం పెరిగినా సరే.. అని ఆశన్న మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు ప్రారంభించాడు. ఇక్కడే ఆశన్న లెక్క తప్పింది. అతివృష్టికి ఒకసారి, అనావృష్టికి మరోసారి పంటలు దెబ్బతిన్నాయి. అప్పులు కుప్పగా మారడంతో పంట చేన్లలోనే ఆశన్న పురుగుల మందు తాగి కుప్పకూలాడు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్కు చెందిన రైతు కాకేర్ల ఆశన్న(45)కు ఆరు ఎకరాల భూమి ఉన్నది.
భార్య సుచరిత, కూతురు త్రిశ, కొడుకు వంశీతో కలిసి హాయిగా సాగుతున్న మధ్యతరగతి కుటుంబం వారిది. ఆశన్న తాతలు, తండ్రుల కాలం నుంచి కూడా వ్యవసాయాన్నే నమ్ముకుని ఉపాధి పొందుతున్నారు. ఆశన్న నమ్మకాన్ని పిల్లలిద్దరూ వమ్ము చేయలేదు. కూతురు త్రిశ ఆదిలాబాద్లో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నది. కుమారుడు వంశీ ఇంటర్ చదువుతున్నాడు. ఇద్దరు పిల్లలు బాగా చదువుకుంటున్న సమయంలో పెరిగిన ఖర్చులతో ఆశన్న ఆలోచన మారింది. ఉన్న ఆరు ఎకరాలకు తోడు మరో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. దంపతులిద్దరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేవారు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని పంటలను తమ చంటి పిల్లల్లాగా సాదుకున్నారు. గతేడాది వానకాలంలో పదెకరాల్లో పత్తి, కంది పంటలు వేశారు. పంట పెట్టుబడి కోసం రూ.3 లక్షల వరకు అప్పులు తీసుకువచ్చారు. పంటలు మంచిగా ఎదుగుతున్న దశలో గత జూలైలో కురిసిన భారీ వర్షాలకు వీరి ఆశలన్నీ కొట్టుకుపోయాయి. పంటలను కాపాడుకునేందుకు ఆశన్న చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పంట చేన్లలో భారీగా నీరు నిలిచి నాలుగెకరాల్లో పత్తి, కంది పంటలు ఏ మాత్రం పనికిరాకుండాపోయాయి. ఆతరువాత యాసంగిలోనూ వేసిన పంటలకు సాగునీళ్లు కరువై దిగుబడి రాలేదు.
దిగుబడి తగ్గి.. అప్పులు పెరిగి..
ఆశన్న పదెకరాల్లో పంటలు సాగు చేస్తే పెట్టుబడి కూడా రాలేదు. ఈ ఏడాది 10 ఎకరాల్లో 35 క్వింటాళ్ల పత్తి దిగుబడి మాత్రమే వచ్చింది. దీంతో పంటల సాగు కోసం ఆశన్న కోసం రూ.7 లక్షల వరకు అప్పు చేశాడు. ఆదిలాబాద్ ఎస్బీఐలో పంట రుణం రూ.3 లక్షలు ఉండగా, మరో రూ.4 లక్షలు ప్రైవేటు అప్పులు ఉన్నాయి. వర్షాలు ఏకధాటిగా కురవడంతో ప్రారంభంలో పంటలు దెబ్బతినగా, తర్వాత వానలు పడకపోవడం, పత్తి, కంది పంటలకు అవసరమైన సమయంలో నీరు అందకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడింది. ప్రభుత్వ హామీ రూ.2 లక్షల రుణం ఇప్పటికీ మాఫీ కాలేదు. అప్పుల బాధ భరించలేక మనోవేదనకు గురైన ఆశన్న మార్చి 19న చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పిల్లలు భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలకు ఆటంకం ఏర్పడింది.
అప్పులే ఆశన్న ప్రాణం తీశాయి
మాకున్న ఆరెకరాలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని..పదెకరాల్లో పంటలు వేశాం. కౌలు, పంట పెట్టుబడి కోసం రూ.3 లక్షల వరకు అప్పులు తెచ్చాం. పిల్లల భవిష్యత్తు కోసమే రెక్కలు ముక్కలు చేసుకున్నాం. ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎక్కువ మిత్తి అయినా పంట పండించి తీర్పుదాం అని అనుకున్నాం. పొద్దుమాపు పొలంగాన్నే పడిఉన్నాం. ఎండా, వాన లేక కష్టపడ్డాం. దేవుడు మా గోస చూడలే. వానలు బాగా వచ్చి పత్తి,
కంది పంటలు మునిగిపోయాయి. మళ్లీ పత్తికి అవసరమైన సమయంలో నీళ్లు అందలేదు. పంట దిగుబడి రాలేదు. పెట్టిన పెట్టుబడి పోయింది. ఆఖరు అప్పులే మిగిలాయి. ఆ అప్పులే మా ఆశన్న ప్రాణం తీశాయి. పిల్లల చదువు కోసమైనా సర్కారు మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
– సుచరిత, రైతు ఆశన్న భార్య