హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించలేదంటున్న కబోదులకు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చింది. ఈ రంగాల్లో తె లంగాణ సాధించిన ఘనతను ఎలుగెత్తి చాటిం ది. వ్యవసాయంతోపాటు అటవీ, మత్స్యరంగాల్లో తెలంగాణ ఉత్పత్తి విలువ ఐదేండ్లలోనే దాదాపు రెట్టింపు స్థాయికి పెరిగినట్టు ఇటీవల విడుదల చేసిన హ్యాండ్బుక్లో ప్రకటించింది. 2017-18లో రూ.95,098 కోట్లుగా ఉన్న ఈ మూడు రంగాల ఉత్పత్తుల విలువ.. 2021-22 నాటికి ఏకంగా రూ.1,81,702 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. గత ఐదేండ్లలో ఈ విలువ రూ.86,604 కోట్లు పెరిగినట్టు తెలిపింది. ఇంతటి వృద్ధి మరే ఇతర రాష్ర్టాల్లోనూ లేదని, తెలంగాణ ప్రభుత్వవిప్లవాత్మక చర్యల వల్లే ఈ మూడు రంగాల్లో గణనీయ వృద్ధి సాధ్యమైందని ఆర్బీఐ చెప్పింది.
ప్రభుత్వ పథకాలే కారణం
స్వరాష్ట్రం ఏర్పాటైన నాటినుంచే తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందుకోసం లక్షల కోట్ల నిధులు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారానే అన్నదాతలకు సుమారు రూ.58 వేల కోట్లు అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందించేందుకు ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇప్పటివరకు రూ.353 కోట్లు ఖర్చుచేసి 425 కోట్ల చేప పిల్లల్ని ఉచితంగా పంపిణీ చేసింది. ఆరేండ్లలో రూ.26 వేల కోట్ల సంపదను సృష్టించగలిగింది. అడవుల పెంపు, సంరక్షణకు ప్రభు త్వం హరితహారం అమలు చేస్తుండటంతో రాష్ట్రంలో అడవుల శాతం భారీగా పెరిగింది.