నల్లగొండ, మార్చి 21 : విశ్వవిద్యాయాల్లో చేస్తున్న పరిశోధనలు రైతులకు చేరేలా ప్రతి శాస్త్రవేత్త కృషి చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్ సుధారాణి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో దక్షిణ తెలంగాణ వ్యవసాయాధికారుల సలహా మండలి ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహించే సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు పూర్తి చేసిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. పరిశోధనా ఫలితాలు ప్రతి రైతుకూ అందినప్పుడే ఉపయోగం ఉంటుందని తెలిపారు. శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు మమేకమై వ్యవసాయ రంగాన్ని కొత్తపుంతలు తొక్కించాలని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పప్పు దినుసులు, నూనె గింజల పంటల విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తుందని, రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా రైతులకు అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహ పరిశోధన డైరెక్టర్ మల్లారెడ్డి, నల్లగొండ వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, శాస్త్రవేత్తలు భరత్భూషణ్, అనిల్ కుమార్, లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, సుల్తాన్, శ్రీనివాస్, ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.