హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : మార్కెట్ ఫీజు వసూలుకు కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెటింగ్ శాఖలో ఫీజుల మాయజాలంపై ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురించిన ‘మార్కెట్ ఫీజు మాయాజాలం!’ కథనం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ కథనంపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో వ్యాపార కార్యకలాపాల కంప్యూటరీకరణ బాధ్యతలను హైదరాబాద్కు చెందిన ఎల్ఐఎల్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు సాఫ్ట్వేర్ అభివృద్ధికి అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. పారదర్శకత, పర్యవేక్షణ, సామర్థ్యాన్ని పెంచడమే దీని ఉద్దేశమని పేర్కొన్నది.
మార్కెట్ ఫీజు, అద్దెలు, లైసెన్స్ ఫీజు, జరిమానాలు, తక్కపట్టీ విక్రయాలు, పర్మిట్ పుస్తకాలు, ఉద్యోగుల రుణ వసూళ్లకు ఈ-రిసిప్ట్స్ జారీ చేస్తున్నట్టు తెలిపారు. గత మూడేండ్లలో ఈ-రిసిప్ట్స్ ద్వారా వసూళ్ల వివరాలు వెల్లడించారు. 2023-24లో 4,43,643 ఈ-రిసిప్టుల ద్వారా రూ.1,225.03 కోట్లు, 2024-25లో 4,41,712 రిసిప్టుల ద్వారా రూ.1,063.09కోట్లు, 2025-26లో 4,15,263 రిసిప్టులకు రూ.867.13 కోట్ల ఆదాయం సమకూరినట్టు వివరించారు.
2025-26లో(జూలై 15 నాటికి) 1,34,711 రిసిప్టులకు రూ.295.18 కోట్లు ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. మ్యానువల్గా వసూలు చేసిన నాటి నుంచి ఈ-రిసిప్ట్స్ కాలం వరకు ఖజానాలో మార్కెట్ ఫీజు జమ చేయడంలో విఫలమైన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.